Wednesday, July 17, 2019

ఆ రోజు గులాబ్‌జామ్‌, మసాలా దోశ తిన్నాం!



తన సుమధుర గానంతో సంగీత ప్రియులనే కాకుండా సామాన్య శ్రోతలను సైతం అలరించిన గాన గంధ్వరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. సంగీతం నేర్చుకోకపోయినా... దాదాపు యాభైవేల పాటల్నిపాడి గిన్నిస్‌ రికార్డు సాధించిన ఘనత ఆయనది. మరి అలాంటి గాయకుడు అందుకున్న తొలి పారితోషికం ఎంతో తెలుసా? మీరు తొలి పారితోషికం అందుకోగానే ఏం చేశారని ఆయనను అడిగితే..!

‘‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రానికి రూ.300 రెమ్యురేషన్‌ ఇచ్చారు. ఆ రోజుల్లో ఘంటసాలగారు 500 రూపాయలు తీసుకునేవారు. మా నాన్న నెలకు 80 రూపాయలు పంపేవారు. నాలుగు నెలలు ఇక నాన్న నుంచి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదని అనిపించింది. తెగ ఆనందపడ్డా. నేను నా ఫ్రెండ్‌ మురళి డ్రైవిన్‌ వుడ్‌ల్యాండ్స్‌కి వెళ్లి చక్కగా గులాబ్‌జామూన్‌, మసాలాదోశ తిన్నాం. అది చాలా ప్లాన్‌చేస్తే గానీ వెళ్లగలిగే రోజులు కావు. ఆ రోజున జేమ్స్‌బాండ్‌ సినిమాకు వెళ్లాం. అంతవరకూ ఎనభై నాలుగుపైసల సినిమాకు వెళ్తే ఆ రోజున రూపాయి పావలాకు వెళ్లాం. కోక్‌ తాగాం. వన్‌బైటూ కాఫీ తాగేవాళ్లం. చెరోకప్పు కాఫీ తాగాం. ఆ తరువాత నేను పాడింది కన్నడ పాట. దానికి 150 రూపాయలు రెమ్యూనరేషన్‌. ఇంతేనా అన్నాడు నా ఫ్రెండ్‌. వందరూపాయలు అంటేనే పెద్ద విశేషం. ముందు నాన్నకు తిరిగి డబ్బులు పంపించాలనే ఆలోచన లేదు. తెప్పించుకోకూడదనే ఆలోచన అంతే. తరువాత ఇంటికి డబ్బులు పంపే శక్తి వచ్చిందనుకోండి. అవన్నీ నాకు ఇప్పటికీ గుర్తే. అప్పట్లో పెద్ద పారితోషకం 500 రూపాయలు. చెక్‌ రూపంలో అందుకున్నా’’ అని చెప్పుకొచ్చారు బాల సుబ్రహ్మణ్యం.

Courtesy: https://www.eenadu.net/cinema/morenews/8/2019/04/18/85629/sp-balasubrahmanyam-after-received-first-remuneration

No comments:

Post a Comment